
భూమి కోల్పోయిన ప్రతిరైతుకు పరిహారం
గద్వాల: భారత్మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన కేటీదొడ్డి, మండలం కుచినెర్ల, అయిజ మండలం దేవబండ గ్రామాల రైతలతో నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేటీదొడ్డి నుంచి రాజోలి వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవునా భారత్ మాల రహదారి నిర్మించబడుతుందని తెలిపారు. భారత్మాల రహదారి పూర్తయిన తర్వాత రవాణా, వ్యవసాయం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో జిల్లా వేగవంతమైన అభివృద్ధి సాధించగలదని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికి 70 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, ఇది రైతుల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రహదాని నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నష్టపరిహారం పెంచే దిశగా ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్యలు జరుపుతామన్నారు. తగిన నిధులు మంజూరయ్యేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
● పదవీ విరమణ పొందుతున్న ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మణ్, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సరోజకు జిల్లా యంత్రాంగం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 ఏళ్లపాటు వివిధ హోదాలతో ఉత్తమ సేవలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.