
పకడ్బందీగా నకిలీ విత్తనాల నియంత్రణ
గద్వాల క్రైం: జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీగా నిఘాపెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు వివిధ పంటల సాగుకు మార్కెట్లో విత్తనాలు, మందులు, పెస్టిసైడ్స్ తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వస్తుంటారని, ఈ క్రమంలో రైతులకు నాసిరకం విత్తనాలు, మందులను ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు అంటగట్టే అవకాశం ఉందన్నారు. నాసిరకం మందులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి నిలువారించలన్నారు. ఎక్కడైన నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బక్రీద్ పండుగా సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పెద్దలతో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి స్వీయ జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో సిబ్బంది ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినా అనర్హత వేటు తప్పదన్నారు. నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్లలో నమోదైన కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్ఐలు శ్రీకాంత్, శ్రీహరి, వెంకటేష్, శ్రీనివాసులు, నాగశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.