ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరారు.
కొనుగోలు కేంద్రంలో తనిఖీలు
అయిజ: మండలంలోని బైనిపల్లిలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు విచారించారు. బుధవారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఇతర రాష్ట్రాల నుంచి వరి ధాన్యం తరలించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశాంత్ను విచారణకు పంపారు. ఆయన కొనుగోలు కేంద్రం చేరుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతుల పంట పొలాలకు వెళ్లి వరి పండించారో లేదో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని ఏఈఓ శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించారు.
మొక్కలే మానవాళికి జీవనాధారం
ఎర్రవల్లి: మొక్కలే మానవాళికి జీవనాధారమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. బుధవారం మండలంలోని బీచుపల్లి పదో బెటాలియన్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నీటి కుంట ఏర్పాటు కోసం కమాండెంట్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీటి కుంటలను ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు అవసరమైనప్పుడు నీరు వినియోగించుకోవచ్చునని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ. 3లక్షల వ్యయంతో బెటాలి యన్లో నీటి కుంటను ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేశం ఉన్నారు.
ప్రభుత్వ విద్యతోనే అంతరాలు లేని సమాజం
గద్వాలన్యూటౌన్: విద్యతోనే సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గుతాయని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, అంతరాలు లేనివిద్య అందించాలని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పౌర స్పందన వేదిక చేపట్టిన ప్రచార జాత బుధవారం గద్వాలలోని పాతబస్టాండ్కు చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గడానికి విద్య ప్రధాన ఆయుధమని అందులోను విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండడం మరీ అవసరం అన్నారు.
సమాజంలోని అంతరాలను తొలగించే ఉద్దేశ్యం లేకే పాలకులు ఉద్దేశపూర్వకంగా విద్యపై దాడి చేస్తున్నారని, అందులో భాగంగా విద్యా ప్రైవేటీకరణ విధానాలను పాల్పడుతున్నారని విమర్శించారు. విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సమాన అవకాశాలు దొరుకుతాయని మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రైవేటీకరణ ద్వార వ్యాపార దృక్పథం మూడనమ్మకాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. రమేష్, గోపాల్, రమణ, చంద్రకాంత్, బీసన్న పాల్గొన్నారు.

నీటి కుంట కోసం కమాండెంట్ భూమిపూజ చేసి

రేపు సీతారాముల కల్యాణం