
‘ప్రజావాణి’కి 53 ఫిర్యాదులు
గద్వాల:వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 53 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో నరెందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు
గద్వాల క్రైం: సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 8 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాలలో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్గా చూపించి రూ.20లక్షలు మోసం చేశాడని, న్యాయం చేయాల్సిందిగా రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. అలాగే, గట్టు మండలానికి చెందిన ఇద్దరు రైతులు భూ వివాదంపై తరచూ ఘర్షణ చోటు చేసుకుంటుందని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీ దృష్టికి రైతులు వివరించారు. ఇలా పలువురు బాధితులు పలు సమస్యలపై ఎస్పీకి విన్నవించారు.
డిగ్రీ పరీక్షలు వాయిదా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రేపు జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: ఈనెల మూడో వారంలో మంచిర్యాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపికలను ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు సభ్యులు నాగరాజు, రాఘవేందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాల కోసం 99590 16610, 99592 20075 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.
స్వయం ఉపాధికి
కార్పొరేషన్ల తోడ్పాటు
స్టేషన్ మహబూబ్నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్నగర్ షాసాబ్గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేవిధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు మంజూరవుతాయని అన్నారు.