
జిల్లాను యూనిట్గా తీసుకొని పరిహారం చెల్లించాలి
గట్టు: భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో చాలా తేడాలున్నాయని, జిల్లాను యూనిట్గా తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులతో కలసి నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణను బుధవారం కలసి వినతిపత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర సినియర్ నాయకుడు నాగర్దొడ్డి వెంకట్రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌస్, మహాబూబ్పాష, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాచర్ల ప్రకాష్ రైతులతో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన గట్టు, గంగిమాన్దొడ్డి గ్రామాలకు చెందిన కొంత మంది రైతులకు ఆర్భిట్రేషన్ తర్వాత అందించే పరిహారం అందకపోవడంతో గంగిమాన్దొడ్డి గ్రామం దగ్గర మంగళవారం పనులను అడ్డుకుని నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు రహదారి పనుల సైట్ ఇన్చార్జ్ అప్జల్తో కలసి అదనపు కలెక్టర్ను కలిశారు. రహదారి నిర్మాణంలో భూముల కోల్పోయిన రైతులకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నష్ట పరిహారం చెల్లించడం ద్వారా రైతులు నష్టపోతున్నారని, జిల్లాను యూనిట్గా తీసుకుని మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. ఆర్భిట్రేషన్ తర్వాత రైతులకు చాలా మంది నోటీసులు రాక డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారని, రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, తక్షణమే వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండవ విడత పరిహారం అందుకొని రైతులను గుర్తించి, వారికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.