భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం

Apr 30 2025 12:19 AM | Updated on Apr 30 2025 12:19 AM

భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం

భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం

అయిజ: రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మంగళవారం అయిజ తహసీల్దార్‌ కార్యాలయంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధరణి స్థానంలో భూ భారతి చట్టం రూపొందించినట్లు చెప్పారు. మనిషికి ఆధార్‌ కార్డులాగా భూమికి భూధార్‌ సంఖ్య కేటాయింపు చేస్తారన్నారు. తద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని వివరించారు. ధరణి వ్యవస్థలో కేవలం వ్యవసాయ భూములే నమోదు అవుతుండగా.. భూ భారతి వ్యవస్థలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ చట్టంలో అన్ని రకాల అప్లికేషన్లు ఉన్నాయని.. హక్కుల రికార్డుల్లో తప్పులను సవరించుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్‌ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుదని పేర్కొన్నారు. 2014 జూన్‌ 2వ తేదీ కంటే ముందు సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుల దరఖాస్తులపై ఆర్డీఓలు విచారించి.. ఆర్హత కలిగిన వారికి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తారన్నారు. వారసత్వ భూముల మార్పిడికి ముందు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసే విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. లైసెన్స్‌ కలిగిన సర్వేయర్లతో భూ సర్వే చేసి.. మ్యాప్‌తో సహా పట్టాదారు పాస్‌పుస్తకాల్లో వివరాలను చేర్చే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ధరణి వ్యవస్థలో భూ సమస్యలపై నేరుగా సివిల్‌ కోర్టుకే వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు భూ భారతి చట్టంలో అధికారుల ఉత్తర్వ్లుపై అసంతృప్తి ఉంటే తహసీల్దార్‌ నుంచి ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్‌ వరకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగాభూ వివాదాలను పరిష్కరించేందుకు గాను ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందని తెలిపారు. జిల్లాలోనే అయిజ మండలంలో ఎక్కువ ఎకరాల భూములు ఉన్నాయని.. 6,500 సమస్యలను తహసీల్దార్‌ పరిష్కరించినట్లు కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడెప్ప, వైస్‌చైర్మన్‌ కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి, ఏఓ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement