ఆలస్యం.. అలసత్వం! | - | Sakshi
Sakshi News home page

ఆలస్యం.. అలసత్వం!

Apr 29 2025 12:16 AM | Updated on Apr 29 2025 12:16 AM

ఆలస్య

ఆలస్యం.. అలసత్వం!

నేటికీ ప్రారంభం కాని జొన్న కొనుగోళ్లు

రాజోళి: అసలే జొన్న కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించగా.. దీనికితోడు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలో జొన్న సాగు చేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సీజన్‌లో సాగు చేసిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ఈ నెల 24న ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మిగతా చోట్ల సైతం మరో మూడు కేంద్రాలు ప్రారంభించిన అనంతరమే జొన్న కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. అకాల వర్షాలతో పంటను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో...

జిల్లాలో 2532 మంది రైతులు 5300 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. యాసంగిలో పండించిన జొన్నలకు కొనేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 14శాతం తేమ శాతం ఉంటే క్వింటాకు రూ.3371 అందించనుంది. ఈ సీజన్‌లో 28వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఈ క్రమంలో ఈ నెల 24న మండల కేంద్రం రాజోళిలో కేంద్రాన్ని ప్రారంభించింది. కానీ నేటి వరకు ఎలాంటి కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో పాటుగా వడ్డేపల్లి మండలం కొంకలలో శనివారం ప్రారంభం కాగా.. రాజోళి మండలం తుమ్మిళ్ల, పచ్చర్ల గ్రామాల్లో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. వీటి మొత్తానికి కాను సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినా.. ఆదివారం అకాల వర్షం కురవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. జిల్లాలో అధికంగా అలంపూర్‌ నియోజకవర్గంలోనే జొన్న సాగు ఎక్కువగా చేపట్టడంతో నియోజకవర్గంలోనే నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు.

టోకెన్లు కోసం తంటాలు

ఇదిలాఉండగా, ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తమ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారనే విషయాన్ని రైతులు గతంలోనే వ్యవసాయ శాఖలో ఆన్‌లైన్‌ చేసి ఉండటంతో, నిజమైన రైతులకే విక్రయించే విధంగా టోకెన్‌ ద్వారా అవకాాశం కల్పిస్తారు. దీంతో రైతులు ఈ టోకెన్లు తీసుకునేందుకు వ్యవసాయ అధికారులను సంప్రదించడం, కార్యాలయానికి వెళ్లడం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం చేశారని, ఇప్పటి వరకే రైతులు ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, కేంద్రాలను ప్రారంభించాక కూడా కొనుగోలులో జాప్యం జరిగితే రైతులు మళ్లీ వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందని, దీన్ని వ్యాపారులు అదునుగా చేసుకునే అవకాశముందని రైతులు అంటున్నారు.

పంట సాగుకు ఆపసోపాలు

ఈ ఏడాది జొన్నల సాగును రైతులు అతి కష్టం మీద పూర్తి చేశారు. పెట్టుబడి కోసం అప్పులు తీసుకురాగా.. అనుకున్నంత స్థాయిలో పంట చేతికి రాలేదని వాపోయారు. ప్రధాన కారణంగా ఆర్డీఎస్‌ కెనాల్‌పై పరిస్థితిని చూపుతున్నారు. పంటకు సరిగ్గా నీరు అవసరమున్న సమయంలో కెనాల్‌లో నీరు నిలిచిపోవడం, ఇండెంట్‌ నీరు రాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. అతి కష్టం మీద నీరు వచ్చినప్పటికీ అదే నీటితో పంటలకు తడులు అందించారు. కెనాల్‌లో నీరు లేని సమయంలో పొలాల పక్కనే ఉన్న బోర్లు, బావుల దగ్గర నీటిని తీసుకుని పంటలకు తడులు అందించారు. ఇలా అతికష్టం మీద ఆపసోపాలు పడి పంటను సాగు చేవరి దాకా తీసుకువస్తే, విక్రయించే సమయంలో కష్టాలు తప్పడంలేదని వాపోతున్నరు. ఈ కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి ఉంటే అప్పుడు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించిన రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వారని అంటున్నారు. కాగా గత ఏడాది ఇవే కేంద్రాల నుంచి 25వేల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 28 వేల క్వింటాళ్ల వరకు కొంటామని అధికారులు అంటున్నారు. కేంద్రం ప్రారంభమయ్యాక సంచులు లేకపోయినప్పటికీ శనివారానికి 28వేల సంచులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా కొనుగోలు ప్రారంభించినా రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొంటారా లేదా ఎదురుచూడాలి.

చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం

ప్రస్తుతం రాజోళి, కొంకల కేంద్రాలను ప్రారంభించాం. పచ్చర్ల, తుమ్మిళ్ల కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. రైతులకు ఇబ్బందులు రాకుండా సంచులు అందుబాటులో ఉంచాం. రైతుల నుండి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం. కొనుగోళ్లకు సంబంధించి వారి ఏఈఓలకు వివరాలు అందిస్తాం.

– రవికుమార్‌, సీఈఓ, వడ్డేపల్లి పీఏసీఎస్‌

పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో రెండు

కేంద్రాల ఏర్పాటు

24న ప్రారంభమైనా..

కొనుగోళ్లు చేపట్టని వైనం

ఇబ్బందుల్లో రైతులు

ఆలస్యం.. అలసత్వం! 1
1/2

ఆలస్యం.. అలసత్వం!

ఆలస్యం.. అలసత్వం! 2
2/2

ఆలస్యం.. అలసత్వం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement