మహిళా సమాఖ్యకు బస్సు మంజూరు | - | Sakshi
Sakshi News home page

మహిళా సమాఖ్యకు బస్సు మంజూరు

Mar 9 2025 12:37 AM | Updated on Mar 9 2025 12:36 AM

ఇటిక్యాల: మండల మహిళా సమాఖ్య ప్రభుత్వం నుంచి ఆర్టీసీ బస్సు మంజూరైనట్లు ఏపీఎం కురుమయ్య శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలందరినీ కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల మహిళా సమాఖ్యకు రూ.36 లక్షల వ్యయంతో ఆర్టీసీ బస్సును మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి

వనపర్తి రూరల్‌: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. సీపీఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్‌బెడ్రూం ఇళ్లు, చందాపూర్‌ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వేస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్‌బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్‌షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్‌లు ఏర్పాటుచేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్‌ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్‌వెస్లీ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్‌, మండ్ల రాజు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన పీయూ వీసీ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్‌, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్‌.శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్‌లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు.

మహిళా సమాఖ్యకు బస్సు మంజూరు  
1
1/1

మహిళా సమాఖ్యకు బస్సు మంజూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement