
ప్రశాంతంగా ముగిసిన జీపీఓ పరీక్ష
గద్వాల: గ్రామ పాలన అధికారి (జీపీఓ) రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులకు సూచించారు. జీపీఓ పరీక్షకు మొత్తం 81మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 77మంది అభ్యర్థులు హాజరయ్యారని, 95.06శాతం హాజరుశాతం నమోదైందని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, పరీక్ష నిర్వాహకులు ఇమ్మానియెల్ ఉన్నారు.
కోయిల్సాగర్లో
11 అడుగుల నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్ సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు.
నేడు ‘పాలమూరు’
అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చే నెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్– 8, 10, 12 ఏళ్లలోపు బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, తహసీల్దార్ ద్వారా కుల, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని సూచించారు.

ప్రశాంతంగా ముగిసిన జీపీఓ పరీక్ష