ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంపై మండల రెవెన్యూ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని తుడుందెబ్బ మేడారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడిగ సునీల్ అన్నారు. ఆదివారం ఆయన మేడారంలో ఆదివాసీ నాయకులతో కలిసి మాట్లాడారు. మండల రెవెన్యూ అధి కారులకు సమ్మక్క సారలమ్మ ఆలయంపై, ఆదివాసీ ఆచార వ్యవహారాలపై భక్తి శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జాతరపై అవగాహన లేని అధికారులను నియమించడం వల్ల జాతర నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందన్నారు. మేడారంలో ఆదివాసీలకు సంబంధించిన భూముల విషయంలో తరతరాలకు నివసిస్తున్న వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు జనార్దన్, సిద్దబోయిన రవి, అర్జున్ కోరం ప్రేమ్, యాదగిరి, యాలం రాంబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు.


