● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
మల్హర్(కాటారం): 14 సంవత్సరాల పై బడిన బాలికలందరూ హెచ్పీవీ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేసుకోవాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, బొప్పారం ఆరోగ్య ఉపకేంద్రాన్ని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవల పట్ల ఇన్ పేషెంట్లు, ఫార్మసీ, హెచ్పీవీ వ్యాక్సినేషన్, వ్యాధి నిరోధక టీకాలు, ఆస్పత్రిలో డెలివరీలపై ఆరా తీశారు. వైద్యసేవలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో ఎన్సీఈడీ ఇంప్రూవ్ చేయాలని సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులు సైతం బాలికలకు బాధ్యతగా తప్పకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. అనంతరం గంగారం గ్రామపంచాయతీలో తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శించి టీచర్స్ హాజరును పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న టీచర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న భోజనం మెనూను అడిగి తెలుసుకున్నారు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరస్వామి, స్థానిక వైద్యాధికారి మౌనిక, బొప్పారం సర్పంచ్ జగదీశ్వర్, కార్యదర్శులు పాల్గొన్నారు.


