భూపాలపల్లి అర్బన్: కార్మిక సంఘాల ఆధిపత్యంతో కార్మిక హక్కులు హరించుకుపోతున్నాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. యూనియన్ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ.. కార్మిక సంఘాల ఆధిపత్య ధోరణులతో కార్మికుల హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణిలో గతంలో ఐక్య పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకున్న గొప్ప చరిత్ర కార్మిక వర్గానిదని తెలిపారు. సింగరేణి పోరాటాల ప్రభావంతో కోలిండియా కార్మికులు కూడా అనేక హక్కులు సాధించుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల విధానాల కారణంగా కార్మిక సంఘాలు విభజనకు గురై, గెలిచిన సంఘాలు యాజమాన్యం, ప్రభుత్వాలకు అనుకూలంగా మారుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి సింగరేణి భవిష్యత్కు ప్రమాదకరమని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు రాములు, పోషమల్లు, ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు మహేందర్, టీఎస్యూఎస్ రాష్ట్ర నాయకులు నీరేటి రాజన్న, జైపాల్ సింగ్, చారువాక, దాసరి జనార్దన్ పాల్గొన్నారు.


