శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి: ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పురోగతిపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, ప్రణాళిక, వైద్య, టీజీఎంఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అవసరమైన పరికరాల కొనుగోలుకు అడ్వాన్స్ మంజూరు చేశామని, పనుల్లో జాప్యం జరిగితే సహించమన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, జిల్లా అధికారులు, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి..
ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి..
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులు సదరం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నూతన సదరం, యూడీఐడీ కార్యాలయాన్ని జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరం శిబిరాలకు వచ్చే దివ్యాంగుల కోసం ఆస్పత్రిలో మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సులభంగా సదరం, యూడీఐడీ సర్టిఫికెట్లు పొందడంతో పాటు వాటి ద్వారా లభించే ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, డీపీఎం రవి, సదరం ఆపరేటర్ పాల్గొన్నారు.


