భక్తుల సందడి
వెంకటాపురం(ఎం)/మంగపేట: చారిత్రక రామప్ప దేవాలయం, హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రామప్పకు పర్యాటకులు, విద్యార్థులు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ పర్యాటకులకు వివరించారు. అలాగే రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శనివారం భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
భక్తుల సందడి


