కాంగ్రెస్‌దే పై‘చేయి’ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌దే పై‘చేయి’

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

కాంగ్

కాంగ్రెస్‌దే పై‘చేయి’

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా సీపీఐతో కలిపి కాంగ్రెస్‌కు 17.. తొలిసారి కాంగ్రెస్‌ చైర్మన్‌.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎవరు..? వామపక్షాలకు ఒకటే.. పాతోళ్లు ఇద్దరే.. 16 మందికి నేడు విప్‌ జారీ..? ప్రశాంతంగా ముగిసిన ఓట్ల లెక్కింపు..

భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా

భూపాలపల్లి: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ విజయ దుందుభి మోగించింది. వామపక్షాలతో జతకట్టి బరిలోకి దిగిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఎవరితో పొత్తు లేకున్నా చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాలను కై వసం చేసుకోబోతుంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీలో నిలిచిన బీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో, ఎప్పటి మాదిరిగానే బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా అధికా ర కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలు చైర్మన్‌ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్ర ప్రచారం నిర్వహించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భూపాలపల్లికి వచ్చి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ సభలు, సమావేశాలు నిర్వహించగా మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారు. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పొత్తుగా ఏర్పడి.. కాంగ్రెస్‌ 25 స్థానాలు, సీపీఐ 4, సీపీఎం ఒక స్థానంలో పోటీ చేశాయి. బీఆర్‌ఎస్‌ 30 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో బరిలో నిలిచాయి. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ 16, సీపీఐ 1, బీఆర్‌ఎస్‌ 10, బీజేపీ 2, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు.

భూపాలపల్లి మున్సిపాలిటీకి మూడుసార్లు ఎన్నికలు జరుగగా.. రెండుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీయే చైర్మన్‌ స్థానాన్ని కై వసం చేసుకుంది. 2014లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో బండారి సంపూర్ణరవి, 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సెగ్గెం వెంకటరాణిసిద్ధు చైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యారు. మూడోసారి జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాన్ని కై వసం చేసుకోనున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సరిపడా వార్డు స్థానాలు కై వసం చేసుకోవడంతో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. చైర్మన్‌ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కాగా 2, 9, 19, 30 వార్డుల నుంచి గెలుపొందిన బుర్ర కొమురయ్య, అప్పం కిషన్‌, కురిమిళ్ల శ్రీనివాస్‌, బొడ్డు అశోక్‌ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైస్‌చైర్మన్‌ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌తో జతకట్టిన వామపక్షాలు ఐదు స్థానాల్లో బరిలో నిలిచినప్పటికీ 24వ వార్డులో వేముల జ్యోతి మాత్రమే గెలుపొందింది. సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తా చాటే సీపీఐ, సీపీఎంలు మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం అంతంత మాత్రంగానే ప్రభావం చూపాయి.

ఈసారి జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్లు 13 మంది పోటీ చేయగా ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మిగిలిన 28 మంది కొత్తగా ఎన్నికై న వారే ఉన్నారు. దీంతో ఈ పాలకవర్గంలో అన్ని కొత్త ముఖాలే కనిపించనున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన 16 మంది అభ్యర్థులకు టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్‌ నేడు(శనివారం) విప్‌ జారీ చేయనున్నట్లు సమాచారం.

భూపాలపల్లి పట్టణంలోని క్రిష్ణాకాలనీ కమ్యూనిటీ హాల్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ పర్యవేక్షించారు.

విజేతలు వీరే.. వివరాలు 11లో..

30 వార్డుల్లో 16 స్థానాలు కై వసం

ఢీలాపడ్డ కారు.. 10 స్థానాల్లోనే గెలుపు

కాంగ్రెస్‌ సహకరించినా ఒక్క వార్డుకే

వామపక్షాలు పరిమితం

రెండింటితో సరిపుచ్చుకున్న బీజేపీ

మున్సిపాలిటీపై తొలిసారి కాంగ్రెస్‌ జెండా

కాంగ్రెస్‌దే పై‘చేయి’1
1/2

కాంగ్రెస్‌దే పై‘చేయి’

కాంగ్రెస్‌దే పై‘చేయి’2
2/2

కాంగ్రెస్‌దే పై‘చేయి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement