రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత ఒక్క ఓటుతోనే గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ కావాలని ప్రత్యర్థి హేమా కోరడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇరువురి మధ్య వీడియో చిత్రీకరిస్తూ ఓట్లను లెక్కించారు. చివరిగా రెండు ఓట్లు ఎక్కువ రావడంతో గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జాటోత్ రుక్మాబాయిపై ఒక్క ఓటు తేడాతో జాటోత్ గణేష్ భార్య లతశ్రీ ఓడిపోయారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గణేష్ రెండు ఓట్లతో గెలుపొందడం కొసమెరుపు.
గడువులోగా పనులు పూర్తిచేయాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని జీపీ ఎన్నికలు సోమవారం మేడారంలోని అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల రాతి నిర్మాణం పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు.
జనావాసాల మధ్య సెల్టవర్ వద్దు
గోవిందరావుపేట : జనావాసాల మధ్య సెల్టవర్ నిర్మించొద్దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఓ వైపు గుడి, మరోవైపు పాఠశాలలు ఉండగా వాటి నడుమ సెల్ టవర్ నిర్మాణానికి ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రేడియేషన్ వల్ల చిన్నారులు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలను టవర్ కంపెనీ విస్మరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థాని కుల కథనం ప్రకారం.. టవర్ నిర్మాణం చేపట్టిన సంస్థ ప్రజలతో ఎలాంటి అవగాహన సమావేశం నిర్వహించలేదని, గ్రామసభ లేదా స్థానిక సంస్థ అనుమతి తీసుకోలేదని, పాఠశాలలు, దేవాలయం ఉన్న విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసమే కంపెనీ వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
నిర్మాణాన్ని అడ్డుకున్న ప్రజలు
సెల్ టవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ టవర్ వద్దు పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు అంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
రెండు ఓట్లతో గెలుపు
రెండు ఓట్లతో గెలుపు


