నియామకమెప్పుడో..
ఐదు నెలల క్రితం ‘ప్రీ ప్రైమరీ టీచర్ల’ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో రెండు నెలల క్రితం నుంచే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన వెంటనే పలు జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు టీచర్ల, ఆయాల నియమకాలు చేట్టారు. జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. విద్యాశాఖ అధికారులు తయారుచేసిన టీచర్ల, ఆయాల ఎంపిక జాబితా పారదర్శకంగా లేకపోవడంతో దానిని సవరించాలని ఆదేశించినట్లు తెలిసింది. రెండో జాబితాను తయారు చేసి కలెక్టర్ వద్దకు మళ్లీ పంపించినట్లు సమాచారం. జిల్లాలో జాబితా ఎంపిక నిర్లక్ష్యంగా ఆలస్యం అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సైతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
టీచర్లు, ఆయాల ఎంపికకు విద్యార్హత, స్థానికత, వయస్సు సంబంధిత అర్హతలు విధించారు. ఈ అర్హత గల వారిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆయా పాఠశాలల్లో తాము సిఫారసు చేసిన వ్యక్తులను మాత్రమే నియమించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు విద్యాశాఖ అధికారులను కోరినట్లు తెలిసింది. తాము సూచించిన వారికి, పార్టీకి చెందిన వారికే అవకాశాలు కల్పించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం.
భూపాలపల్లి అర్బన్: ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీప్రైమరీ) తరగతులు ప్రారంభించేందుకు ఈ ఏడాది జూలై మాసంతో ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఏడాది నుంచే అమల్లో తీసుకురావాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ జిల్లాలో నేటి వరకు ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. ఇందుకు సంబంధించిన టీచర్లు, ఆయాలను నియమించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. విద్యా సంవత్సరంలో సగం నెలలు గడిచిపోయినా ఇంకెప్పుడు నియామకాలు చేపట్టి ప్రీప్రైమరీ ప్రారంభిస్తారని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో 55 పాఠశాలలు ఎంపిక
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 55 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఈ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు గుర్తించారు. చిన్నారులకు చదువు నేర్పించేందుకు ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్ను, వారి అవసరాలు తీర్చేందుకు ఆయాను నియమించాల్సి ఉంటుంది. మొత్తం 55 మంది టీచర్లు, 55 ఆయాలను నియమించనున్నారు. జిల్లాలో 55 పాఠశాలల్లో 2025–26విద్యా సంవత్సరానికి టీచర్లు, ఆయాలను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఆగస్టు 22వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు నోటీఫికేషన్ జారీచేసి 28వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించారు.
జిల్లాలో వచ్చే ఏడాదిపై ప్రభావం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జిల్లాలో అమలు కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం జిల్లాలో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో తల్లిదండ్రులు నేరుగా అంగన్వాడీల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది రెండు నెలల క్రితం ప్రీ ప్రైమరీ ప్రారంభించినట్లయితే ప్రతీ పాఠశాలలో కనీసం 10 నుంచి 20 మంది వరకు విద్యార్థులు చేరేవారని అంచనా వేస్తున్నారు.
కలెక్టర్ వద్ద ఫైల్ పెండింగ్..!
నాలుగు నెలల్లో ముగియనున్న
విద్యా సంవత్సరం
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు
ఎవరి నిర్లక్ష్యం..!
రాజకీయ జోక్యం..


