
సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ తనిఖీ
గణపురం: సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాశ్రాయి సభ్యులతో కలిసి శుక్రవారం మండలకేంద్రంలోని రేషన్షాపు నంబర్ 3లో తనిఖీచేశారు. రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ అధికారి జమన్ కుమార్, భూపాలపల్లి సివిల్ సప్లయీస్ అధికారి శ్రీనాధ్, డీఎం రాములు పలు మండలాల తహసీల్దార్లు ఉన్నారు.
రీజియన్ రక్షణ జీఎం
పరిశీలన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 2, 3లను రామగుండం రీజియన్ రక్షణ జీఎం మధుసూదన్ శుక్రవారం పరిశీలించారు. ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో మొదటగా వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని ఉపరితల గని ప్లాన్లను పరిశీలించి ఉపరితల గనులలో జరుగుతున్న పని విధానాలు, స్థితిగతులు, యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తగు ప్రణాళికలు సిద్ధంచేసుకొని రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి నిబంధనలు పాటించాలని, ఉద్యోగులందరూ రక్షణ పరికరాలను ఉపయోగించి సమష్టిగా కృషిచేసి ఉత్పత్తి శాతాన్ని పెంచి సంస్థ మనుగడకు తోడ్పడాలని రక్షణ జీఎం కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ఏరియా సేఫ్టీ అధికారి ప్రసాద్, అధికారులు శ్యాంసుందర్, రమాకాంత్, క్రిష్ణయ్య, భిక్షమయ్య, శ్రీనివాస్, రాజారావు పాల్గొన్నారు.
అంబులెన్స్ వాహనాల తనిఖీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని 108, 102, నియోనటల్ అంబులెన్స్ వాహనాలను శుక్రవారం ఉమ్మడి వరంగల్ క్లస్టర్ మేనేజర్ నసీరుద్దీన్ తనిఖీ చేశారు. అంబులెన్స్లను తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ వచ్చిన వెంటనే వాహనం బయలుదేరాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నరేష్, టెక్నీషియన్, పైలెట్లు సుజాత, నరేష్, విజేందర్, రాజశేఖర్, సురేష్ పాల్గొన్నారు.
గీత కార్మికుడికి తీవ్రగాయాలు
రేగొండ: గీత కార్మికుడు తాటిచెట్టు పై నుంచి జారీపడటంతో తీవ్ర గాయాలైన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన గీత కార్మికుడు ఓరుగంటి సాయిలు వృత్తిలో భాగంగా శుక్రవారం తాటి చెట్టు ఎక్కి కిందికి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద జారిపడ్డాడు. దీంతో సాయిలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో పరకాల ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
మొక్కలను సిద్ధంచేయాలి
కాటారం: వన మహోత్సవానికి మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ అన్నారు. మండలకేంద్రంలోని వననర్సరీని శుక్రవారం డీఆర్డీఓ పరిశీలించారు. మొక్కలను జాగ్రత్తగా పెంచాలని.. ప్రతీ మొక్క ఎదిగేలా చూడాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. డీఆర్డీఓ వెంట ఏపీఓ వెంకన్న, ఫ్లాంటేషన్ మేనేజర్ శ్రీకాంత్, టీఏ మనోజ్, పంచాయతీ కార్యదర్శి షగీర్ఖాన్ ఉన్నారు.
జాతీయ ఉత్తమ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 13వ తేదీ వరకు నేషనల్ అవార్డ్సు టీచర్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాన్నారు.