
రోడ్లపైనే చెత్త కుప్పలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణ నిర్వహణ అధ్వానంగా మారింది. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏ మూలన చూసినా చెత్త కుప్పులు కుప్పులుగా పేరుకుపోయి కనిపిస్తుంది. పట్టణంలో ప్రతీ మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరణ చేయడం వలన ప్రజలు ఇళ్లలోని చెత్తను తీసుకువెళ్లి కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నా పడేసిన చెత్తను మున్సిపల్ సిబ్బంది తొలగించడం లేదు. వర్షాకాలం కావడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడంతో పాటు ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి.
చెత్తకుండీలు అంతంత మాత్రమే
భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉండగా.. సుమారు 70వేల జనాభా ఉంది. కేవలం 17 చెత్త కుండీలు మాత్రమే కొనుగోలు చేసి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. కాలనీలో ప్రతి మూడు రోజులకు ఒక సారి చెత్తను సేకరించడం వలన మూడు రోజుల పాటు చెత్తను నిల్వ చేసుకోలేక ప్రజలు కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురుగు కాలువల్లో పడేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం రూ.20లక్షలతో చెత్తను తీసుకువెళ్లే ట్రక్ మౌంటెడ్ గ్యారేజ్ కాంపాక్టర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. కుండీలో వేసిన చెత్తను ఈ వాహనం మనుషుల సహాయం లేకుండా తీసుకెళ్తుంది. పట్టణంలో ప్రతీ కాలనీలో రెండు కుండీలను ఏర్పాటు చేయడం వలన రోడ్లు, ఖాళీ స్థలాలలో చెత్త పడేయకుండా ఉండే అవకాశం ఉంటుంది.
పై ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి పట్టణంలోని గణేష్చౌక్ నుంచి జంగేడుకు వెళ్లే దారిలోని శాంతినగర్కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ప్రాంతం. ప్రతీ రోజు దారి పొడవునా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ప్రధాన రహదారి పక్కనే చెత్త కనిపిస్తున్నటికీ మున్సిపల్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. చెత్త వేయకుండా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు.
కాలనీల శివారుల్లో దుర్వాసన
పట్టణంలో కనిపించని చెత్తకుండీలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
భూపాలపల్లి–కాటారం జాతీయ రహదారి పక్కన పట్టణ సమీపంలోని పాత ఎర్ర చెరువు వద్ద చెత్త ఎప్పుడు చూసినా కుప్పులు కుప్పులుగా పేరుకుపోయి మినీ డంపింగ్ యార్డును తలపిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన చెత్త కుండీ సైతం ఎప్పుడూ నిండిపోయి ఉంటుంది. పట్టణంలో ఎక్కడో మూలన పేరుకుపోయి ఉన్న చెత్తను కాకుండా ప్రధాన రహదారి పక్కన రోజుల తరబడి పేరుకుపోతున్న చెత్తను సైతం తొలగించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనం ఇది.
పట్టణంలోని రాజీవ్నగర్ సమీపంలోకి కేటీకే 6వ గనికి వెళ్లే దారి పక్కన పడేసిన చెత్త నెలల తరబడి ఉండి కుల్లిపోయి, భూగర్భంలోనే కలిసిపోతుంది. అక్కడ పడేసిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తరలించడం లేదని కాలనీవాసులు అంటున్నారు. కాలనీలో ఎక్కడి నుంచో చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పడేస్తున్నారని కాలనీవాసులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. చెత్త కుళ్లిపోయి దుర్వాసన వ్యాపించడమే కాకుండా దోమల, ఈగలు వృద్ధి చెందుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు.

రోడ్లపైనే చెత్త కుప్పలు

రోడ్లపైనే చెత్త కుప్పలు

రోడ్లపైనే చెత్త కుప్పలు

రోడ్లపైనే చెత్త కుప్పలు