
యోగాతో మానసిక ప్రశాంతత
భూపాలపల్లి అర్బన్: ప్రతీ రోజు యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత పెరుగుతుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జీఎం కార్యాలయంలో వారం రోజుల శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీఎం హాజరై ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహా భాగ్యం, ఈ సంవత్సరానికి థీమ్ వన్ ఎర్త్, వన్ హెల్త్ను ఎంచుకున్నట్లు చెప్పారు. మనసు శాంతంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు తొలగుతాయని అన్నారు. యోగా ఒక జీవన విధానం, మంచి ఆరోగ్యం కోసం ప్రతీ రోజు యోగా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది కలిసి యోగా ప్రతిజ్ఞ చేసి యోగా గురువు ఆంజనేయులుతో యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటరామరెడ్డి, కవీంద్ర, జోతి, మారుతి, చంద్రశేఖర్, ప్రదీప్, రాజు, సందీప్, కార్మికసంఘాల నాయకులు మధుకర్రెడ్డి, ఆసిస్పాషా పాల్గొన్నారు.