
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80.12శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రణవి, రితీష్ నాయక్, స్ఫూర్తి, నితీష్, కీర్తన, చైత్రను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మా ట్లాడుతూ ఎంత నేర్చుకున్నాం.. అనేది ముఖ్యం కాదని.. నేర్చుకున్నది ఎవరికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యమని అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ముందుకురావాలని తెలిపారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుతో పాటు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అసిఫాబాద్ జిల్లాలు ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలవడం అభినందనీయమన్నారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో అవార్డులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క