
బోడకాకర సాగుతో నికర ఆదాయం
మహబూబాబాద్ రూరల్: విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న ఆగాకర (బోడకాకర) సాగుతో అధిక దిగుబడి, నికర ఆదాయం వస్తుందని, చిన్న, సన్నకారు రైతులకు గొప్ప వరం లాంటిదని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. బోడకాకర సాగు, ఆదాయం, లాభాలు, ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే అంశాలపై ఆయన వివరించారు.
లాభాలు :
● బోడకాకర సాగును అన్ని పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. 2 నెలలలోనే పంట చేతికొస్తుంది. 6 నెలల వరకు దిగుబడి ఉంటుంది.
● సీజన్, డిమాండ్ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకు పలుకుతుంది.
● బోడకాకరలో పోషకాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే బోడకాకర సాగు లాభదాయకం.
● ఒక ఎకరంలో 4 నుంచి 6 నెలల కాలంలో కనీసం రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
విత్తనం ద్వారా :
● ఇది సులువైన పద్ధతి. విత్తనం మొలక 10 నుంచి 15 శాతంగా ఉంటుంది. అందులో మరలా ఆడ, మగ మొక్కలు ఉంటాయి. ఆడ మొక్కలు 15 నుంచి 20 శాతం ఉంటాయి. ఎకరాకు వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు ఒక అడుగు చొప్పున దూరంలో నాటడానికి 1,000 ఆడ మొక్కలు అవసరం అవుతాయి. దీనికి 3 వేల మొక్కలు అనగా 9 వేలు (మొలక 30 శాతం) గింజలు కావాలి. ఈ విధంగా ఎకరాకు అరకుంచం విత్తనం అవసరమవుతుంది. పొలంలో వరుస వరుసకు ఆరు అడుగులు, పాదు పాదుకు మధ్య ఆరు అడుగుల దూరంలో నాటిన స్తంభాల మధ్య వరుస వరుసకు రెండు అడుగులు, పాదు పాదుకు మధ్య రెండు అడుగుల చొప్పున 16 మొక్కలు వస్తాయి. (అనగా 36 చదరపు మీటర్లకు) ప్రతి 10 ఆడ మొక్కలకు 1 మగ మొక్కను విధిగా ఉంచుకోవాలి. దాదాపు వెయ్యి ఆడ మొక్కలకు 100 మగ మొక్కలు ఉండాలి.
● నారుమడిని వరుస వరుసకు నాలుగు అడుగులు, పాదు పాదుకు మధ్య ఒక అడుగు సైజులో, ఎత్తులో తయారు చేయాలి. 15 సెంటీ మీటర్ల వరుసల మధ్య 10 సెంటీ మీటర్ల దూరంలో విత్తనాలు విత్తాలి. వాటిపై గడ్డి వేసి పెట్టాలి. 40 నుంచి 45 రోజుల్లో మొలకలు వస్తాయి. మార్చి నెలాఖరులో నారుమడి వేస్తే, జూన్లో నాటుటకు తయారవుతాయి.
నాటుట :
● దుంపలను గాని విత్తనం మొక్కలను 30 నుంచి 30 సెంటీ మీటర్ల కొలతలు కలిగి పెంట ఎరువుతో నిండిన గుంతల్లో నాటుకోవాలి. నేరుగా గుంతల్లో విత్తనాలు నాటుకోవాలంటే ప్రతీ గుంతకు 10 నుంచి 15 విత్తనాలు వేస్తే 3 నుంచి 5 మొలకలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి. అప్పుడు ఒక ఆడ తీగను ఉంచి మిగతావి వేరే చోట నాటుకోవాలి.
పంట కాలం :
● పంటకాలం మే/జూన్ నుంచి అక్టోబర్/నవంబర్ వరకు ఉంటుంది. తర్వాత తీగ చనిపోతుంది. దుంప భూమిలో సుప్తావస్థలో ఉంటుంది. మళ్లీ మే/జూన్లో మొలకెత్తుతుంది.
● అయితే జూన్ అక్టోబర్ మధ్యలో ఎక్కువగా పూసే ఆడ మొక్కలను, తక్కువ ఎత్తులో పూసే మగ మొక్కలను ఎంచుకోవాలి.
● సాధారణంగా ఆకులు ఒకే తమ్మెతో తీగలు ఎక్కువ దిగుబడి ఉంటుంది. 2.5 కిలోలు మొక్కకు ఇస్తుంది. అదే ఆకులు 3 నుంచి 5 తమ్మెలుగా ఉన్న తీగలు తక్కువ దిగుబడి అంటే 1.0 నుంచి 1.5 కిలోలు మొక్క ఇస్తుంది.
● అదే విత్తనమైతే ప్రతి గుంతలో 10 నుంచి 15 విత్తనాలు వేయాలి.
● అందులో నుంచి 3 నుంచి 5 పిలుకలు / మొక్కలు 40 నుంచి 45 రోజుల్లో వస్తాయి.
పందిరి :
● భూమికి 4 నుంచి 6 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు / జీఐ వైరుతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. తీగలను అంతటా పాకించాలి. లేదా ప్రతి మొక్క రెండు పాదలు ఏర్పాటు చేసుకుని తీగలను అల్లించవచ్చు.
దిగుబడి :
● బోడకాకరను సాధారణంగా వెజిటబుల్ చికెన్ అని అంటారు. పంట 45 నుంచి 50 రోజుల్లో పూతకు వస్తుంది. పూత నుంచి కాయ కాయడానికి వారం రోజులు పడుతుంది. వారానికి రెండుసార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు ఎకరం 40 నుంచి 50 కిలోలు వస్తాయి. సాధారణంగా 15 నుంచి 20 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది.
● ఆగస్టు నుంచి అక్టోబరు చివరి దాకా కాయలు వస్తాయి. ఆపై తీగలు ఎండిపోతాయి. మరల మరుసటి సంవత్సరం తొలకరికి దుంపలు చిగురిస్తాయి. వారానికి రెండు సార్లు కోత వస్తుంది. ప్రతి కోతకు 40 కిలోల కాయలు వస్తాయి. 8 నుంచి 10 క్వింటాళ్లు ఎకరాకు, అధిక దిగుబడికి మొదటగా బ్రష్తో మగ పూల నుంచి పుప్పొడి సేకరించి, ఉదయం వేళలో ఆడ పూలపై అద్దాలి.
● వెదురు బుట్టల్లో అడుగున ఎండుగడ్డి వేసి, కాయలతో నింపి తడి గోనె సంచిలో కప్పి ప్యాకింగ్ చేసి దూరం ప్రాంతాలకు మార్కెట్ చేస్తారు. కాపు అనంతరం నవంబరు నుంచి నీరు పెట్టరాదు. నిద్రావస్థలో వుంచాలి. మరలా మే నుంచి మొలకలు వస్తాయి.
రోగ నిరోధక శక్తి పెంపు
ప్రస్తుత వాతావరణ మార్పులు, పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ, డెంగీ, కరోనా, పలు వైరసుల వల్ల కలిగే అనారోగ్య లక్షణాల నుంచి సంరక్షణకు, రోగ నిరోధక శక్తి పెరగాలంటే అధిక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్న ఆగాకర (బోడకాకర) చాలా ముఖ్యం.బోడకాకర ఏక పంటగా, అంతర పంటగా, బోర్డర్ పంటగా, టెర్రస్ (మిద్దె) తోటగా, ఇంటి ఆవరణంలో పెంచుకోవచ్చు. ఒకప్పుడు ఈ తీగజాతి పంట, అటవీ ప్రాతంలో సహజసిద్ధంగా పండేది. రానురాను ఈ పంటకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దాంతో రైతులు ఈ పంటను చిన్నచిన్న కమతాల్లో సాగు చేసుకుంటున్నారు.
ఆగాకర కాయలో ఔషధ గుణాలు,
పోషక విలువలు మెండు
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు
అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉండే బోడకాకరలో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉండి కిలో రూ.80 నుంచి రూ.200 ధర పలుకుతోంది. ఉద్యాన రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి.
ముఖ్యాంశాలు
తప్పనిసరిగా ప్రతి 10 ఆడ మొక్కలకు,
ఒక మగ మొక్క చొప్పున నాటుకోవాలి.
మగపూల నుంచి సేకరించిన పుప్పొడిని మె త్తటి బ్రష్తో తీసుకొచ్చి ఆడపూలపై అద్దితే ఎక్కువ దిగుబడి వస్తుంది.
వర్షాకాలంలో వర్షపాతం తక్కువైనప్పుడు 10 రోజులకోసారి తేలికపాటి తడులు ఇవ్వాలి.
రాయితీలు
రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం నుంచి పందిరి సాగుకు రూ.50 వేల రాయితీ ఉంది.

బోడకాకర సాగుతో నికర ఆదాయం

బోడకాకర సాగుతో నికర ఆదాయం

బోడకాకర సాగుతో నికర ఆదాయం