
‘ఉపాధి’ వేతన బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: గ్రామీణ ఉపాధి హామీ కూలీల వేతన బకాయిలను విడుదల చేయాలని, పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలని, రోజు కూలి రూ.600లు, 200 రోజుల పనిదినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాములు డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో వచ్చిన గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల ఏర్పాటు పేరుతో గ్రామాలను విలీనం చేసి లక్షలాది మందిని ఉపాధి పనికి దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంబాల స్వరూప, లోకిని స్వరూప, వేలు రజిత, చిలుక రాఘవులు, అజ్మీరా భిక్షపతి, మనీఫా చందు, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
పట్టణ పేదలకు ఉపాధి పని కల్పించాలి
వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా కార్యదర్శి జి.రాములు