రిజిస్ట్రేషన్‌ శాఖలో డిప్యుటేషన్‌ బదిలీలు | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిప్యుటేషన్‌ బదిలీలు

May 31 2025 1:18 AM | Updated on May 31 2025 3:55 PM

కాజీపేట అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లతో పాటు సబ్‌ రిజిస్ట్రార్లకు డిప్యుటేషన్‌ రూపంలో స్థానం చలనం లభించింది. వరంగల్‌ ఆర్వో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జాయింట్‌ –1 సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న రామనరసింహరావు ఇటీవల స్టేషన్‌ ఘన్‌పూర్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లగా, కొత్తగూడెంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రంజిత్‌ డిప్యుటేషన్‌పై స్టేషన్‌ ఘన్‌పూర్‌కు వచ్చారు. రామనరసింహరావు తిరిగి వరంగల్‌ ఆర్వోకు తన యథాస్థానం జాయింట్‌ –1 సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో శనివారం చేరనున్నారు. అదేవిధంగా మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మరో సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్ట్‌ను కేటాయించగా వరంగల్‌ ఆర్వోలో సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ నస్రీన్‌.. మహబూబాబాద్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు.

ప్రజాకవి కాళోజీ సినిమాకు గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు

హన్మకొండ కల్చరల్‌: జైనీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వరంగల్‌కు చెందిన నవలా రచయిత, సినీ దర్శకుడు ప్రభాకర్‌జైనీ దర్శకత్వం వహించిన, విజయలక్ష్మీ జైనీ నిర్మించిన ప్రజాకవి కాళోజీ చిత్రం గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపికైంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ పేరున సినిమా అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజాకవి కాళోజీ చిత్రానికి గద్దర్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డును ప్రకటించారు. 

ఈ సందర్భంగా ప్రభాకర్‌ జైనీ హర్షం వ్యక్తం చేశారు. మంచి చిత్రాలు, సామాజిక ప్రయోజనం కోసమే చిత్రాలు తీయాలనే ఉద్దేశ్యంతోనే ప్రజాకవి కాళోజీ చిత్రం తీసినట్లు, చైతన్యవంతమైన సమాజానికి ముఖ్యకారకుడైన కాళోజీని నేటి యువతరం మరిచిపోతున్నారన్నారు. మన తెలుగు జాతి వారసత్వ సంపద కాళోజీ అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజుకు ప్రభాకర్‌ జైనీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రేపు గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

హన్మకొండ: ప్రతిభ కలిగిన గౌడ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు గోపా హనుమకొండ జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రతిభా పురస్కారాల ప్రోగ్రాం కన్వీనర్‌ వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియేట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ హంటర్‌ రోడ్డులోని గౌడ హాస్టల్‌లో జూన్‌ 1న జరగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో 550 మార్కులకు పైగా, ఇంటర్‌లో 950 మార్కులకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు వేణుగోపాల్‌ వివరించారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిప్యుటేషన్‌ బదిలీలు1
1/1

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిప్యుటేషన్‌ బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement