
భూముల సర్వే అడ్డగింత
● పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన
భూపాలపల్లి రూరల్: మల్హర్ మండలం తాడిచెర్ల ఓసీ నుంచి గణపురం మండలం చెల్పూరు జెన్కో వరకు నిర్మిస్తున్న కన్వేయర్ బెల్డ్ సర్వే పనులను రైతులు మంగళవారం అడ్డుకున్నారు. కన్వేయర్ బెల్డ్ కోసం పచ్చని సాగు భూములు ఇవ్వబోమని, బెల్ట్ తోవను గ్రామం పక్కనుంచి తీసుకోవాలని పనులను అడ్డుకొని పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూనిర్వాసితులు మాట్లాడుతూ.. గ్రామంనుంచి కన్వేయర్ బెల్ట్ వేయడం వలన బెల్ట్నుంచి సుమారుగా రెండు కిలోమీటర్లు బొగ్గు ద్వారా వాతావరణం కలుషితమై పంటలు పండవన్న విషయం అందరికీ తెలుసన్నారు. అధికారులు మాత్రం బెల్ట్ కింద కోల్పోయిన భూముల వరకు మాత్రమే 2013 జీఓ ప్రకారం మాత్రమే పరిహారం ఇస్తామని చెబుతున్నారన్నారు. బెల్ట్ కింది భూములతో పాటు బెల్ట్నుంచి రెండు కిలో మీటర్లు వరకు ఉన్న సాగు భూములకు 2013 జీఓ ప్రకారం కాకుండా ఇప్పటి మార్కెట్ ధర చెల్లిస్తే భూములను ఇస్తామని తెలిపారు. గ్రామంలో సుమారుగా 25 కుటుంబాలు ఉంటాయని, గ్రామాన్ని తరలిస్తే ఇన్నిరోజులు కలిసున్న తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం, అధికారులు, ఆర్ఆర్ ప్యాకేజీలు ఇస్తామని రైతులను విభజిస్తూ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి చర్చలు జరపాలని కోరారు. అధికారులు రైతులతో మాట్లాడకుండా గ్రామంలో సర్వేలు నిర్వహిస్తే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందు డబ్బాతో హెచ్చరించారు. నిరసనలో రైతులు విప్లవకుమార్రెడ్డి, రొంటాల బాపురెడ్డి, సుధాకర్రెడ్డి, సద్దిమహేష్, రొంటాల దేవేందర్, కొకురే రంజిత్కుమార్, రమ, జ్యోతి, గొడుగు సదయ్య, గజ్జి ఒదెలు, బాల్రెడ్డి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.