నాలుగు రోజులుగా కొనడం లేదు..
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో సెంటర్ నిర్వాహకులు వివిధ కారణాలతో కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత సీజన్కు గాను జిల్లాలో మొదటగా స్టేషన్ఘన్పూర్లో ఈనెల 23న మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అయితే రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రారంభోత్సవ సమావేశంలో స్వయంగా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. రైతులు తీసుకొచ్చిన మక్కలకు నిబంధనల మేరకు తేమశాతం ఉన్నప్పటికీ ఫంగస్ ఉందని, నాణ్యత లేదంటూ పొంతన లేని కొర్రీలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఇతర మండలాల నుంచి..
నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు పాలకుర్తి మండలం నుంచి సైతం రైతులు మక్కలు ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తున్నారు. అయితే మక్కలు తీసుకొచ్చిన మూడు, నాలుగు రోజుల వరకూ కొనుగోళ్లు చేయకుండా తిరిగి తీసుకెళ్లాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే మార్క్ఫెడ్ అంటున్నారని, తీరా చూస్తే అంతా దోపిడీయే ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అని వస్తే పట్టించుకునేవారు లేరన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఘన్పూర్ మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు
కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం
తేమ, ఫంగస్ సాకుతో తిప్పి
పంపిస్తున్నారు..
మూడు, నాలుగు రోజులైనా
కొనకపోవడంతో రైతుల ఇక్కట్లు
ప్రభుత్వ కేంద్రమని వస్తే ఇష్టారాజ్యం
వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని
అన్నదాతల డిమాండ్
మాది పాలకుర్తి మండలం తీగారం గ్రామం. నాలుగు రోజుల క్రితం ముప్పై క్వింటాళ్ల మక్కలను మార్క్ఫెడ్ సెంటర్కు తీసుకువచ్చా. అయితే ఒకసారి తేమశాతం లేదని, మరోసారి ఫంగస్ అంటూ పొంతన లేని కొర్రీలతో ఇంతవరకూ కొనుగోలు చేయలేదు. తీరా ఇక్కడికి వస్తే బాగాలేవంటూ ఇంటికి తీసుకెళ్లమంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.


