పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవ కమిటీని నియమిస్తు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కమిటీ చైర్మన్గా పాలేపు సత్తయ్య, కమిటీ సభ్యులుగా వీరమల్ల రామకృష్ణ, నిమ్మల మంజుల, పిట్టల యాకయ్య, దండెంపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఉత్సవ కమిటీ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
జనగామ నుంచి వల్మిడికి ప్రత్యేక బస్సులు
పాలకుర్తి టౌన్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం శుక్రవారం జనగామ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ 30 నిమిషాలకు ఒక్క బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.
జనగామ: హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ, హజ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న యాత్రికులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మా ట్లాడుతూ.. హజ్ యాత్ర సందర్భంగా భారీ జనసమ్మర్థం ఉండే నేపథ్యంలో సంక్రమణ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు.
ప్రైవేట్ హాస్పిటళ్లపై విచారణ జరిపించాలి
జనగామ: పట్టణంలో హన్మకొండ రోడ్డులోని లోటస్ హాస్పిటల్ భవనంతో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులపై విచారణ చేయాలని 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారికి గురువారం ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక అనుమతులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, భవన అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే మెడికల్ కళాశాల, అనుబంధంగా ఉన్న ఎంసీహెచ్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పనిచేస్తున్న వైద్యులు, ఫ్రొఫెసర్ల సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని కోరుతూ వైద్యారో గ్య శాఖ మంత్రితో పాటు డీఎంఈకి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత, పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయన్నారు. చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించకుండా, హైదరాబాద్లాంటి కార్పోరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.


