జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు సహకరించక ఎంతో మంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులను ఆపేస్తున్నా రు. విద్యార్థులకు ప్రతిభ సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడడంతో తల్లిదండ్రులు మధ్యలోనే చదువు మాన్పించి తమకు అండగా ఉండేందుకు ఇంటి పనులు, కూలీపనులకు తీసుకెళ్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేటి పరిస్థితుల్లో విద్యకు దూరం కాకుండా ఉండేందుకు వారికి అండగా కేంద్రప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈపథకం వల్ల ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఉన్నత చదువుల కు తోడ్పాటు అందించనుంది. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. అన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఉండాల్సిన అర్హతలు..
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠ
శాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండి చదివేవారు ఈపరీక్షకు అర్హులు కాదు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్ష ల్లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం ఇలా..
ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా కేంద్రంలో ఉన్న డీఈఓ కార్యాలయానికి అందజేయాలి. ముందుగా అన్లైన్లో దరఖాస్తు ఫారాలను తీసుకుని వివరాలు పూరించాక వాటితో పాటు ఓసీ, బీసీ, మైనార్టీలు అయితే రూ.100 , ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు అయితే రూ.50 డీడీ తీసీ జిల్లా కార్యాలయంలో అందజేయాలి. దేశవ్యాప్తంగా నవంబర్ 23న నిర్వహించే ఈపరీక్షకు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
ఉపాధ్యాయులు చొరవ చూపాలి..
పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ఇలాంటి పరీక్షలు రాయించేందుకు చొరవ చూపాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను ప్రోత్సహిస్తే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 103 ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న వారు అర్హులు. 7వ తరగతిలో 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 50 శాతం ఉంటే సరిపోతుంది. మొత్తం 6 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతారు.
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్తో ఆర్థిక భరోసా
అర్హత సాధిస్తే ఏడాదికి రూ.12వేలు
9నుంచి–12వ తరగతుల వరకు నేరుగా
ఖాతాల్లో జమ
దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 6..
నవంబర్ 23న పరీక్ష
గ్రామీణ విద్యార్థుల్లో డ్రాపవుట్లను
తగ్గించడమే లక్ష్యం
పరీక్ష విధానం..
మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కుల పరీక్షలో ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్– ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బీలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
పేద విద్యార్థులకు ‘ఉపకారం’
పేద విద్యార్థులకు ‘ఉపకారం’