
‘డబుల్’ ఇళ్ల పంపిణీలో వసూళ్లు ?
తరిగొప్పుల: గత ప్రభుత్వం గూడులేని నిరుపేదల ఆవాసం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో కొందరు వసూళ్లకు పాల్పడినట్లు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో అప్పటి ప్రభుత్వం 2020లో 30డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించింది. కాగా లబ్ధిదారులు ఎంపిక కోసం రెవెన్యూ అధికారులు పలుమార్లు గ్రామసభలు నిర్వహించారు. అయినప్పటికీ తుది జాబితా కొలిక్కిరాకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాలు లేనప్పటికీ తహసీల్దార్ సెలవులో ఉండగా శనివారం తహసీల్దార్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ సిబ్బంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఏంటని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో అప్పటికే 21 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయగా 9 మందికి పంపిణీ చేయలేదు. కాగా, లబ్ధిదారుల్లో ఒక్కరైనా ఓ మహిళా లబ్ధిదారుకు ఫోన్ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులకు ఇవ్వాలని చెప్పి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయమై రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆంధ్రయ్యను వివరణ కోరగా కలెక్టర్ సూచన ఆదేశాల మేరకు తహసీల్దార్ సూచన మేరకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, ఎవరి నుంచి డబ్బులు వసూలు చేయలేదన్నారు.
ఇల్లు ఇప్పించండి సారూ..
ఎప్పుడూ కూలుతుందో తెలియని పెంకుటింటిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న తనకు ఇల్లు ఇప్పించాలని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన రేణుక అనే మహిళ శనివారం కలెక్టర్ను వేడుకునేందుకు వెళ్లగా పోలీసులు ఆమెను గేటు వద్ద అడ్డుకున్నారు. తన వెంట తెచ్చుకున్న సంచిని తనిఖీ చేశారు. పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నానని అయినప్పటికీ తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మృతి చెందాడని, కొడుకు, కూతురుతో కాలం వెళ్లదీస్తున్న తనని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది.
ఉన్నతాధికారుల ఆదేశాలు లేకున్నా పట్టాల పంపిణీ
తహసీల్దార్ సెలవులో ఉండగా గుట్టుచప్పుడు కాకుండా..