
ఉత్తమ ఫలితాలు సాధించాలి
జనగామ రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని సిద్దిపేట రోడ్డులోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను విద్యాశాఖ అధికారి భోజన్నతో కలిసి సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి కష్టపడాలని, ముందే లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా 9, 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మెనూ ప్రకారంగా భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
జల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, ప్రతీ వ ర్షపు చుక్కను భూమిలో ఇంకింప చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిణి వసంత ఆధ్వర్యంలో స్టేషన్ఘన్పూర్ డివిజన్లోని గ్రామాల్లో జల సంరక్షణ, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్లోని విశ్వనాథపురం, రాఘవాపూర్, తానేదారిపల్లి, కొత్తపల్లి, తాటికొండ, ఇప్పగూడెం, మీదికొండ, రంగరాయగూడెం తదితర గ్రామాల్లో కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో జల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, ఇసుక, ఇటుక, కంకర, మొరం, ఐరన్ వంటి సామగ్రి ధరలను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఏపీఓ ప్రే మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా