
సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి
జనగామ రూరల్: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవా రం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో జూన్ నాలుగో తేదీలోపు అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పక్రియ పూర్తి చేయాలని చెప్పారు. రేషన్ కార్డుల లబ్ధిదారులకు ప్రభుత్వం జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ మేరకు రేషన్ డీలర్లతో తహసీల్దార్లు సమీక్షించాలని, లబ్ధిదారుల థంబ్, ఐరిష్, గుర్తింపు జాగ్రత్తగా తీసుకుని జూన్ 30వ తేదీలోగా రేషన్ పంపిణీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు దరఖాస్తుల వెరిఫికేషన్ పెండింగ్ ఉండొద్దని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మంజూరైన ఇళ్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇప్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో సిమెంట్, ఇటుకబట్టీ యూనిట్ల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు ప్రతీ గ్రామంలో భూభారతి సదస్సులు పక్కాగా నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు ఉన్నాయని, జూన్ 5లోపు రైతు వేదికల్లో అన్నదాతలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి విత్తనాల కొనుగోలు లో రైతులకు సహకరించాలన్నారు. జూన్ 3 నుంచి ‘బడిబాట’ ప్రారంభించాలని, అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వివరించారు.
జూన్ 2న ప్రొసీడింగ్స్ పంపిణీ
రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి.. జూన్ 2న లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ వికాసం అమలుపై రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ ద్వారా మొక్కుబడిగా పథకాలు అమలు చేశాయని, తమ ప్రభుత్వం లక్షలాది మంది యువతకు స్వయం ఉపాధి కల్పించా లనే చిత్తశుద్ధితో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ పథకం కింద వచ్చే సహాయంతో యువత వ్యాపారం చేసి లబ్ధిపొందాలని సూచించారు. మంజూరు చేసిన యూనిట్లను గ్రౌండింగ్ చేసిన తర్వాత వాటి పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించే సమావేశాల్లో పథకంపై చర్చించి తుది జాబితాను ఆమోదించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, బీసీ, ఎస్సీ సంక్షేమ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా