‘పోల్‌ ట్యాక్స్‌’ ఆదాయంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

‘పోల్‌ ట్యాక్స్‌’ ఆదాయంపై దృష్టి

Jun 30 2025 4:15 AM | Updated on Jun 30 2025 4:15 AM

‘పోల్‌ ట్యాక్స్‌’ ఆదాయంపై దృష్టి

‘పోల్‌ ట్యాక్స్‌’ ఆదాయంపై దృష్టి

● జిల్లాలో సర్వే పూర్తి చేసిన విద్యుత్‌ శాఖ ● లెక్క తేలిన స్తంభాల సంఖ్య ● పూర్తిస్థాయిలో వసూలుపై అధికారుల దృష్టి ● ఆందోళన చెందుతున్న కేబుల్‌ ఆపరేటర్లు

మెట్‌పల్లి: ‘మల్లాపూర్‌, మెట్‌పల్లి సబ్‌ డివిజన్ల పరిధిలో విద్యుత్‌ శాఖ ఇటీవల పోల్‌ ట్యాక్స్‌ విధింపు కోసం ప్రత్యేకంగా సర్వే జరిపిందన్లీ ప్రాంతంలో గతంలో సుమారు మూడు వేల స్తంభాలకు మాత్రమే ట్యాక్స్‌ చెల్లించేవారు ఆపరేటర్లు. సర్వే తర్వాత వాటి సంఖ్య 6,147కు పెరిగింది. ఇలా జిల్లా మొత్తంగా సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించింది విద్యుత్‌శాఖ. దాని ప్రకారం తొందరలోనే పూర్తి స్థాయిలో ట్యాక్స్‌ వసూలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.’

జిల్లాలో కేబుల్‌ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్ల నుంచి పోల్‌ ట్యాక్స్‌ వసూలు చేయడంపై విద్యుత్‌ శాఖ దృష్టి సారించింది. ఇప్పటివరకు నామమాత్రంగానే ఈ ట్యాక్స్‌ వసూలు చేస్తున్న ఆ శాఖ.. ఇకనుంచి పూర్తి స్థాయిలో వసూలుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోల్‌ టూ పోల్‌ సర్వేను చేపట్టిన అధికారులు.. ఇటీవలే దానిని పూర్తి చేశారు. మరోవైపు విద్యుత్‌ శాఖ తీరుతో కేబుల్‌ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పోల్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

పట్టణాల్లో రూ.20..పల్లెల్లో రూ.15

● కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు తమ వ్యాపారం కోసం విద్యుత్‌ స్తంభాలను వినియోగిస్తున్నందుకు ట్యాక్స్‌ను వసూలు చేయాలని మొదటగా 2005లో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

● పట్టణాల్లో ఒక్కో స్తంభానికి రూ.20, పల్లెల్లో రూ.15 చొప్పున వసూలు చేయాలని ఆ సమయంలో ప్రకటించిన జీవోలో స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విద్యుత్‌ శాఖకు అప్పగించింది.

● అప్పటి నుంచి ఆ శాఖ అధికారులు ట్యాక్స్‌ను వసూలు చేస్తూ వస్తున్నారు.

● కొంతకాలంగా స్తంభాలు వినియోగిస్తున్న ఆపరేటర్లతోపాటు ప్రొవైడర్ల సంఖ్య పెరిగింది.

● దీనికి అనుగుణంగా ట్యాక్స్‌ రాకపోవడంతో విద్యుత్‌ శాఖకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని భావించిన ఉన్నతాధికారులు.. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి స్తంభాల లెక్క తేల్చాలని ఆదేశించారు.

● ఇటీవల పట్టణాలతోపాటు ప్రతి గామంలో స్థానిక అధికారులు సర్వే చేపట్టి పూర్తి చేశారు. దీనివల్ల ప్రతి సబ్‌ డివిజన్‌లో వినియోగిస్తున్న స్తంభాల సంఖ్య భారీగా పెరిగినట్లు తేలింది.

పెరగనున్న ఆదాయం..

● ఇంతకాలం ఆపరేటర్లు, ప్రొవైడర్లు పెద్ద సంఖ్యలో స్తంభాలు వినియోగిస్తూ నామమాత్రంగా ట్యాక్స్‌ చెల్లిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.

● ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో వినియోగిస్తున్న ప్రతి స్తంభానికి కచ్చితంగా ట్యాక్స్‌ వసూలు చేసేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

● ఇప్పటికే కొంతమేర ట్యాక్స్‌ ఆదాయాన్ని పెంచినప్పటికీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వసూళ్లు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఆందోళన చెందుతున్న ఆపరేటర్లు

● ట్యాక్స్‌ వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన విద్యుత్‌ శాఖ తీరుతో ముఖ్యంగా కేబుల్‌ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

● కేబుల్‌ రంగంలోకి కార్పొరేట్‌ సంస్థల ప్రవేశంతో స్థానికంగా తమ వ్యాపారం లాభసాటిగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్‌ చెల్లించడం తమకు ఎంతో భారమవుతోందని, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా రద్దు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement