
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల రూరల్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, వసతి గృహంలో పారిశుధ్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని, దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
సైక్సిక్ మహాసంగ్లో ఉపాధ్యాయుడి ప్రసంగం
సారంగాపూర్: గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న హమారా విద్యాలయ్, హమారాతీర్థ్ కార్యశాల కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా బీర్పూర్ మండలం కొల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వొడ్నాల రాజశేఖర్ పాల్గొన్నారు. పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏబీఆర్ఎస్ఎం (అఖిల భారతీయ సైక్సిక్ మహాసంగ్) జాతీయ అధ్యక్షుడు నారాయణలాల్ గుప్తా, ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కార్యక్రమానికి పాల్గొన్న రాజశేఖర్ ప్రతి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని, విద్యాభివృద్ధికి తల్లిదండ్రులతోపాటు స్థానికుల సహకారం తీసుకోవాలని కోరారు.
రాయికల్లో ఐటీడీఏ ఏర్పాటు చేయండి
రాయికల్: రాయికల్ మండలంలో ఐటీడీఏగా ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్య గోవింద్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాజాతి అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఏ సమస్య వచ్చినా ప్రతిఒక్కరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్యా రాకేశ్, గోవింద్నాయక్, మాలోత్ తిరుపతి, నరేందర్, పల్త్యా ప్రభాకర్, భూమానాయక్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామం
జగిత్యాలటౌన్: రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామమని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటుతోనే సరిపెట్టకుండా కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. పచ్చబంగారంగా పేరున్న పసుపు పంటకు రూ.పదివేలకు మించి ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రాయితీలు ఇవ్వాలని కోరారు.
అమిత్షాకు స్వాగతం
జగిత్యాలటౌన్: పసుపు రైతుల దశాబ్దాల కల సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పసుపుబోర్డు కార్యాలయం, లోగో ఆవిష్కరణకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా నిజామాబాద్ వచ్చారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి స్వాగతం పలికారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి