
రోళ్లవాగు పనులు ప్రారంభం
సారంగాపూర్: సుదీర్ఘకాలం తరువాత రోళ్లవాగు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు కట్ట(బండ్)పై 1,275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్(పిట్టగోడ) నిర్మాణం చేపట్టారు. పనులు సత్వరమే పూర్తి చేసి, పంటలకు నీరందించాలని రైతుల డిమాండ్ మేరకు పనులు ప్రారంభం కావడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పారపెట్ వాల్ నిర్మాణంతో పాటు మూడు తూములకు గేట్లు బిగించాలని కోరుతున్నారు. గేట్లు బిగింపు జరగకపోతే ప్రాజెక్టులోకి వచ్చే వర్షపునీరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–53, 12 ఎల్ కాలువ నీరు గోదావరిలో కలుస్తుందని చెబుతున్నారు.
రూ.153.81కోట్లతో ప్రాజెక్టు
బీర్పూర్ శివారులో 2015–16 సంవత్సరంలో రూ.60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. పలు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యా యి. దీంతో వ్యయం భారీగా పెరిగి రూ.136.81 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయి. ఏడాదికాలంగా నిధుల లేమితో మిగితా పనులకు అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు అటవీశాఖ అనుమతులు ఆలస్యమయ్యాయి. ప్రభుత్వం ప్రాజె క్టు పనులు పూర్తి చేయడానికి ఇటీవల రూ.17కోట్లు విడుదల చేసింది. దీంతో రోళ్లవాగు వ్యయం రూ.153.81కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తయితే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో అటవీశాఖకు భూములు ముంపునకు గురికావడంతో పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. త్వరలో అటవీశాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి పంటలకు నీటి విడుదల చేసేందుకు మూడు స్లూయిస్(తూములు)ఏర్పాటు చేశారు. వీటికి గేట్లు బిగించాల్సి ఉంది. ప్రాజెక్టుకు 1,500మీటర్ల పొడవుతో మూడు కట్టల(బండ్) నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో 1,275 మీట ర్ల కట్ట పూర్తి కాగా, 1275 మీటర్ల పొడవుతో పారపెట్ వాల్ పనులు చేపడుతున్నారు. ఈ ఖరీఫ్లో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈ ఛక్రూనాయక్ వెల్లడించారు.
1,275 మీటర్ల పారాపెట్ వాల్ నిర్మాణం
ప్రాజెక్టు పనులకు గతంలో రూ.136.81 కోట్లు ఖర్చు
ఇటీవల మరో రూ.17 కోట్లు విడుదల

రోళ్లవాగు పనులు ప్రారంభం