
‘భూ భారతి’ షురూ..
● భూ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు ● పైలెట్ ప్రాజెక్ట్గా బుగ్గారం మండలం ఎంపిక ● ఈనెల 5 నుంచి 16 వరకు గ్రామాల్లో పర్యటన
జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం జిల్లాలో అమల్లోకి రానుంది. ఈ నెల ఐదో తేదీ నుంచి ముహూర్తం ఖరారు చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని బుగ్గారం మండలాన్ని ఎంపిక చేసింది. అధికారులతో కూడిన రెండు బృందాలు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టాన్ని సవరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే జిల్లాలో గతనెల 17 నుంచి ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా సమస్యల పరిష్కారానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలాన్ని ఎంపిక చేసి రెండు బృందాలను నియమించారు. ఈ బృందాలకు రైతులు నేరుగా భూ సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. భూ తగాదాలు, వారసత్వ బదిలీలు, మూటేషన్లు, ఏ సమస్య ఉన్నా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ స్థాయిలోగాని సమస్యలను ఆర్డీవో స్థాయిలో, కలెక్టర్స్థాయిలో పరిష్కరించనున్నారు. వెనువెంటనే సమస్యలు పరిష్కారం కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేక మంది తమ భూమి హక్కుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో భూ ప్రక్షాళన సందర్భంగా అనేక తప్పులు దొర్లడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ భూ భారతి చట్టంలో అనేక సమస్యలను తీసేయడంతో కొత్తగా రైతులకు దరిచేరేలా ఉండటంతో సమస్యలు పరిష్కారమవుతాయని రైతుల్లో ఆశలు నెలకొంటున్నాయి. జిల్లాలో గతంలో సుమారు 10 వేలకు పైగానే సాదాబైనామాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఈ చట్టం రావడంతో పరిష్కారమయ్యే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అసైన్డ్, అటవీ భూముల వద్ద కూడా వివాదాలున్నాయి. పార్ట్–బీలో పేర్కొన్న నిషేధ జాబితాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ చట్టంతో సమస్యలు తీరుతాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. భూభారతిలో ఇక నుంచి ప్రతి భూమికి భూదార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య నంబర్లు సైతం ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సులభంగా అయ్యేలా చట్టాన్ని రూపొందించారు. తహసీల్దార్లకు, ఆర్డీవోలకు సైతం మ్యూటేషన్ అధికారం కల్పించడం వంటివి ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రస్తుతం ఈ మండలంలో దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. నూతన చట్టం ప్రకారం సమస్యలను పరిష్కరిస్తే చాలామందికి ఉపశమనం కలగనుంది. ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదన్నది దరఖాస్తు చేసుకున్న రైతులకు నివేదిక అందిస్తారు. జిల్లా మొత్తం అమలైతే భూ సమస్యలు దాదాపుగా తీరే అవకాశాలుంటాయి.
టీమ్–2
అధికారులు
సిహెచ్.కృష్ణచైతన్య, తహసీల్దార్, ధర్మపురి
పి.శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్, బుగ్గారం
సీహెచ్.సురేందర్రావు, సీనియర్ అసిస్టెంట్, బుగ్గారం
జనార్దన్, జూనియర్ అసిస్టెంట్, బుగ్గారం
ఆర్.నరేందర్, మండల సర్వేయర్, రాయికల్
పర్యటించే గ్రామాలు తేదీలు
మద్దునూర్ 5, 6
సిరికొండ 7, 8
వెల్గొండ 9, 12
చిన్నాపూర్ 13, 14
టీమ్ – 1
అధికారులు..
ఎంఏ.మాజిద్, తహసీల్దార్, బుగ్గారం
బాపురెడ్డి గిర్దవార్, బుగ్గారం
ఎంఏ.స్వామి, రికార్డు అసిస్టెంట్
కె.సుధాకర్, జూనియర్ అసిస్టెంట్
పరమేశ్వర్, మండల సర్వేయర్
పర్యటించే గ్రామాలు తేదీలు
యశ్వంతరావుపేట 5, 6
శెకల్ల 7, 8
గంగాపూర్ 9, 12
గోపులాపురం 13, 14
బుగ్గారం 15, 16