
క్రీడాకారిణులకు ‘ఫేస్బుక్ మిత్రుల’ చేయూత
ధర్మపురి: చదువుతోపాటు పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన ఇద్దరు క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అయ్యే ఖర్చుల నిమిత్తం ఫేస్బుక్ మిత్రులు రూ.1.16 లక్షలు సాయం అందించారు. ధర్మపురికి చెందిన శ్యామ్రావ్ ఐశ్వర్య, మండలంలోని నక్కలపేట గ్రామానికి చెందిన భూక్య శ్రావణి ఓ వైపు చదువుతూనే మరోవైపు పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తున్నారు. ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఈనెల 5న నిర్వహించే ఏషియన్ ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. అయితే పోటీలో పాల్గొనడానికి చెల్లించే ఫీజు, ప్రయాణ ఖర్చులు ఇరువురి కుటుంబ సభ్యులకు భారంగా మారాయి. వీరి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి ఏప్రిల్ 4న ఫేస్బుక్లో పోస్టు చేసి వీరికి సాయం అందించాలని కోరారు. తెలుగురాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు శ్రావణి తండ్రి తిరుపతి బ్యాంకు ఖాతాలకు రూ.1.16 లక్షలను విరాళాలుగా పంపించారు. వాటిని స్థానిక సీఐ రాంనర్సింహారెడ్డి స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై ఉదయ్కుమార్తో కలిసి శ్రావణికి రూ.66 వేలు, ఐశ్వర్యకు రూ.50వేలు పంపిణీ చేశారు. రమేశ్తోపాటు సా యం అందించిన దాతలను సీఐ అభినందించారు.
● రూ.1.16 లక్షలు సాయం