ఇంటింటా ఇంకుడుగుంత

మాట్లాడుతున్న జెడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత
 - Sakshi

● జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత

జగిత్యాలరూరల్‌: ఇంటింటా ఇంకుడుగుంత నిర్మించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత కోరారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఇంకుడుగుంతల తవ్వకంపై జెడ్పీ సీఈవో రామానుజాచార్యులు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌తో సమీక్షించారు. గ్రామాల్లో మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని, తద్వారా దోమలు వృద్ధి చెంది ప్రజలు మలేరియా, డెంగీ తదితర వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఇంకుడుగుంతల ద్వారా ఇలాంటి పరిస్థితులు ఉండవని ఆమె తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డ్‌కు తరలించాలని సూచించారు.

రైతులకు అండగా ఉంటాం

జగిత్యాలరూరల్‌: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్‌కు లేదన్నారు. 40ఏళ్లుగా రైతుల కోసం ఏపని చేయనివారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగు రెట్ల పంట దిగుబడి వస్తోందని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఇప్పటికే పంట నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. పీఎం ఫసల్‌ బీమా యోజన పథకం గురించి కనీస అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ నక్కల రాధ, సింగిల్‌విండో చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, సందీప్‌రావు, అర్బన్‌ రైతుబంధు కన్వీనర్‌ జుంబర్తి శంకర్‌ పాల్గొన్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top