టెహ్రాన్: చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన సైనిక శక్తిని మోహరిస్తున్నారు. అయితే, అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ భూభాగాల్లో భూతల దాడులు చేస్తే ఉపేక్షించబోమని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ మానసిక యుద్ధానికి తెరతీసింది
ఇరాన్లోని ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సమన్వయంతో సైనిక దాడులు చేస్తామని తెలిపారు. ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాలనే యత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ‘యుద్ధభూమి నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా సైన్యం, ఇరాన్ యోధుల ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది’. అమెరికా చర్యలు చివరికి అవమానం, బంధనం, వినాశనం దిశగా తీసుకెళ్తాయి. పర్షియన్ గల్ఫ్లో సొరచేపలకు అమెరికా సైనికులు ఆహారం అవుతారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఏరోస్పేస్ కమాండర్ సయ్యద్ మజీద్ మౌసావీ మాట్లాడుతూ.. మా ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్లోని నియోట్ హోవావ్లోని కెమికల్ ప్లాంట్, ఒక రిఫైనరీ, రెండు స్టీల్ కాంప్లెక్స్లు, రెండు అల్యూమినియం కాంప్లెక్స్లు లక్ష్యంగా దాడులు చేస్తాం. మీరు (అమెరికా-ఇజ్రాయెల్) బాధను అనుభవించే వరకు మా దాడులు కొనసాగుతాయి’ అని అన్నారు.
మొత్తం మీద, ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియా భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.


