హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి శుభవార్త అందిస్తూ హర్మూజ్ జలసంధిని ఎట్టకేలకు తెరిచింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ల సీజ్ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఆ దేశాల మధ్య సీజ్ఫైర్ కొనసాగేంతవరకూ హర్మూజ్ తెరిచే ఉంటుందని పేర్కొంది.
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటనతో నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి. అదే సమయంలో హర్మూజ్ను తెరిచామన్న ఇరాన్ ప్రకటన అనంతరం చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇక హర్మూజ్ను తెరిచినందుకు ఇరాన్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్నిగురువారం రాత్రి(భారత కాలమాన ప్రకారం) ట్రంప్ తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం అవి సత్ఫలితాల్ని ఇవ్వడం గమనార్హం.


