ఇరాన్పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ప్రకటనపై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి బూటకమన్నారు. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నకిలీ వార్తలు సృష్టిస్తున్నారన్నారు.
నిన్న( సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేస్తూ " అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో చర్చలు జరిపాడనేది పూర్తిగా అవాస్తవం దీని వెనుక రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ధరలు తగ్గించడం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులనుంచి ప్రజల దృష్టి మళ్లించడం"అని తెలిపారు.
తమ దేశంపై జరిగిన దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని గాలిబాఫ్ తెలిపారు. ఇరాన్ అంతా ఏకంగా ఉందని తామనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు.


