పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్‌ జాత్యహంకార వ్యాఖ్యలు | Indian Faces Racist Tirade In Poland | Sakshi
Sakshi News home page

పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్‌ జాత్యహంకార వ్యాఖ్యలు

Sep 4 2022 5:39 AM | Updated on Sep 4 2022 11:18 AM

Indian Faces Racist Tirade In Poland - Sakshi

లండన్‌: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది.

నువ్వెందుకు పోలండ్‌ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్‌ పోలిష్‌ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్‌ టీవీ’ అనే విద్వేష  గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్‌ మినడియో జూనియర్‌గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement