తెలంగాణకు చెందిన గణేశ్కు గాయాలు
లండన్: ఉక్రెయిన్పై రష్యా వరుసగా ఆరో రోజు రాత్రి కొనసాగించిన దాడుల్లో ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియాలో పనిచేసే భారతీయుడొకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని గుజరాత్కు చెందిన సుదర్శన్ భవిలాల(40)గా, క్షతగాత్రుడిని తెలంగాణకు చెందిన గణేశ్ కల్లెడ(35)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేశ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కీవ్లోని భారత ఎంబసీ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి గైడెడ్ ఏరియల్ బాంబులు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాదాపు ఏడు గంటలపాటు రష్యా దాడులు కొనసాగాయి.
ఈ దాడుల్లో మొత్తం 12 మంది చనిపోగా. ముగ్గురు చిన్నారులు సహా 20 మంది గాయపడ్డారు. దాడులతో పలు నగరాల్లోని నివాస భవనాలు, మౌలిక వనరులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో తీర ప్రాంత ఒడెసా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని వేలాది గృహస్తులు చీకట్లలోనే గడపాల్సి వచ్చింది. రాజధాని కీవ్లోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు చనిపోగా, మరొకరు గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధ్రువీకరించారు. భారతీయుడి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉక్రెయిన్లోని భారత ఎంబసీ తెలిపింది. అతడు పనిచేసే కంపెనీ ఉక్ర్జలిజ్నిట్సియా కంపెనీతో ఉక్రెయిన్ అధికారులతో టచ్లో ఉన్నామని ‘ఎక్స్’లో వివరించింది.


