అడ్డగుట్ట: ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో ఆదివారం రాత్రి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో రెండు వారాల క్రితం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పది రోజులుగా రోడ్డు తవ్వకాలు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభం నుంచి స్థానికంగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సరఫరా అయ్యే విద్యుత్కు సంబంధించి ప్యానల్ బోర్డుకు అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ అమర్చారు. అయితే రోడ్డు తవ్వుతున్న సమయంలో ప్యానల్ బోర్డుకు సంబంధించిన కేబుల్స్ బయటకు వచ్చాయి. సంబంధిత విద్యుత్శాఖ అధికారులకు రోడ్డు కాంట్రాక్టర్ సమాచారం ఇవ్వలేదు. ఆదివారం కురిసిన వర్షం కారణంగా వర్షపు నీరు సదరు కేబుల్స్లోకి వెళ్లడంతో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో మంటలు ఆగిపోయాయి.
ఆజాద్ చంద్రశేఖర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తప్పిన ప్రమాదం
భయాందోళనకు గురైన నిర్వాసితులు
రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం


