
బక్రీద్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
చార్మినార్: బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకు మంగళవారం ఆయన సాలార్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) విక్రమ్ సింగ్ మాన్, జిహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ టి వెంకన్న, ఆర్టీఓ రఘు ప్రసాద్, పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, విద్యుత్ శాఖ ఎస్ఈ డి.సోమి రెడ్డితో పాటు పలువురు అధికారులు, మజ్లీస్ ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో తరతరాలుగా అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే నగర కమిషనరేట్ చుట్టూ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జంతువులను రవాణా చేయరాదన్నారు. పశువైద్యుల అనుమతితోనే జంతువులను తరలించాలన్నారు. అక్రమ రవాణా పేరుతో ఇతరులు ఎవరూ వాహనాలను అడ్డుకోరాదని కోరారు. వాహనాలను ఆపేందుకు, తనిఖీ చేయడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవాలి
అధికారులు, మతపెద్దలకు సీపీ సూచనలు
సాలార్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో సమన్వయ సమావేశం