
తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు
భయాందోళనకు గురైన స్థానికులు
శ్రీనగర్కాలనీ: శ్రీనగర్కాలనీ వడ్డెరబస్తీలో విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం ఉదయం కరెంట్ సరఫరాలో లోపాలు రావడంతో బస్తీలో ఉన్న హెటెన్షన్ వైర్ తెగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదని, రెండేళ్ల క్రితం ఇదే హైటెన్షన్ వైరు తెగి మీదపడడంతో మనీలా అనే మహిళ మృతిచెందిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. హైటెన్షన్ లైన్లో చాలా సమస్యలున్నాయని అధికారులకు విన్నవించినా ఇప్పటికీ సమస్యను పరిష్కరించలేదని వాపోయారు. పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని, స్కూల్ ఆవరణలో సైతం వైర్లు తెగిపడ్డాయని అన్నారు. విద్యార్థులు పరిసరప్రాంతాలకు రానివ్వకుండా అడ్డుకొని విద్యుత్ అధికారలకు సమాచారం ఇచ్చి కరెంట్ సరఫరా నిలిపివేశామన్నారు. స్థానిక కార్పొరేటర్ వనం సంగీత, సీనియర్ నేత వనం శ్రీనివాసయాదవ్, బస్తీ నేత వడ్డెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్థానిక వడ్డెర బస్తీ నుండి శ్రీనగర్కాలనీ మీదుగా శ్రీనగర్కాలనీ సబ్స్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లి ధర్నాకు దిగారు. హెటెన్షన్ లైన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ లైన్ తొలగింపుకు సిఫార్సు చేశామని, ప్రభుత్వం మారడంతో పెండింగ్లో ఉందని, త్వరితగతిన ఉన్నాతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఏడీఈ ప్రేమ్కుమార్ తెలిపారు.