● బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా
వరంగల్ అర్బన్: ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకూడదని బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనా ఆదేశించారు. శనివారం కార్యాలయంలోని తన చాంబర్లో వివిధ విభాగాల పర్యవేక్షకులు, సెక్షన్ హెడ్లు, న్యాయాధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ విభాగాల్లో పెండింగ్లో ఉన్న ప్రజావాణి ఫిర్యాదులు, ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు కేసులు, ఇతర పెండింగ్ ఫైళ్ల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో బల్దియా న్యాయాధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు సంతోశ్, ఆనంద్కుమార్, దేవేందర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన కోమళ్ల
టోల్ ప్లాజా రుసుములు
రఘునాథపల్లి : వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్ ప్లాజా రుసుములు పెరిగాయి. పెరిగిన చార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి లింకింగ్ ఫ్యాక్టర్ పునరుద్ధరణతో 5 శాతం టోల్ ధరల పెంపునకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) హైదరాబాద్ ప్రాంతీయ ఆఫీస్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఈ నెల 27 నుంచి 31, మార్చి 2027 వరకు అమలులో ఉంటాయి.
పెరగనున్న టోల్ చార్జీలు ఇలా...
కారు, జీప్, వ్యాన్, లైట్ మోటారు వాహనం ఒక వైపు రూ 130, ఇరు వైపులా రూ. 190, నెల వారీ 4,295, లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు ఒకవైపు రూ. 210, ఇరువైపులా రూ. 310, నెలవారీ రూ. 6,935, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ. 435, ఇరువైపులా రూ. 655, నెల వారీ రూ. 1,4530, త్రీ యాక్షల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ. 475, ఇరు వైపులా రూ. 715, నెలవారీ రూ.1,5850, హెచ్సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ. 685 ఇరువైపులా రూ.1,025, నెలవారీ రూ. 22,785, ఓవర్సైజ్ వాహనం ఒక వైపు రూ. 830, ఇరువైపులా రూ. 1,250, నెల వారీ రూ. 27,740కు పెంచారు. నెల వారి పాస్ రూ. 350 నుంచి రూ. 360కి పెరిగింది.
చిన్నారి హత్యకు
యత్నించిన వ్యక్తి అరెస్ట్
కొడకండ్ల : పాత గొడవలు, భూతగాదాలను దృష్టిలో ఉంచుకుని ఓ చిన్నారి హత్యకు యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం కేసు వివరాలను విలేకరులకు వివరించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన అందె మధు, జ్యోతి దంపతుల కుమార్తె నౌమిక శుక్రవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలోని అందె సత్తార్ ఇంటి ఆవరణలోని సంపులో అనుమానాస్పదంగా పడి మూత పెట్టి ఉంది. అదే సమయంలో తన కూతురి కోసం తల్లి జ్యోతి వెతుకుతూ సంపు వైపు వెళ్లగా అమ్మ అని అరుపులు వినిపించాయి. సమీపంలో ఉన్న అందె భవాని, ఉప్పలమ్మ సాయంతో సంపునుంచి కూతురిని జ్యోతి బయటకు తీసింది. ఇదే సమయంలో తనను చూసి అందె రంజిత్ అనే వ్యక్తి పారిపోయాడని, అతనిపై అ నుమానం ఉందని జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని విచారించగా చిన్నారి తాత అందె వెంకన్నతో పాత గొడవలు, భూతగాదాలపై కక్ష పెంచుకుని నౌమిక హత్యకు యత్నించినట్లు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.
● రేపటి నుంచి అమల్లోకి
● ఐదు శాతం పెరగనున్న ధర


