● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిఎద్దడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టి విజయవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జల సంరక్షణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రతీ వర్షపునీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీబీజీ–రామ్జీ పథకం కింద గ్రామాల్లో ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరుబావుల రీచార్జ్ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు బోరుబావుల రీచార్జ్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన పంటలు, విత్తనాల ఎంపికపై సీడ్ మేళా సదస్సుల ద్వారా రైతులకు వివరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సోమవారం నాటికి కాంటింజెన్సీ ప్రణాళిక నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ జలసిరి కార్యక్రమం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను డీఆర్డీఓ మేన శ్రీను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.


