ఖిలా వరంగల్: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం వరంగల్ ఉర్సు కరీమాబాద్లోని బీరన్న దేవాలయం బోనాలకు సర్వం సిద్ధమైంది. బీరన్న స్వామి దేవాలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో బీరన్న ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయ పరిసరాల్లో బల్దియా అధికారులు తాగునీటి ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఆలయంలో కురుమ కులస్తులే కాకుండా స్థానికంగా ఉండే ఇతర కులస్తులు కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఆలయ పూజారులు స్వామి వారి బండారి, కంకణాలు సిద్ధం చేశారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కురుమల ఉపవాస దీక్షతోనే బీరన్నకు నైవేద్యంగా బోనాన్ని సమర్పించనున్నట్లు బీరన్న ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్లి రవి తెలిపారు.
విద్యుద్దీపాలతో వెలిగిపోతున్న ఆలయాలు
నేడు ఊరేగింపునకు భారీ బందోబస్తు


