హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 4 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసి అమ్మవారి ఉత్సవమూర్తులను ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తా, కులసుందరి (రూపం) క్రమంలో అమ్మవారికి పూజలు చేశారు. షోడశీ క్రమాన్ని అనుసరించి భద్రకాళి మాతను జ్ఞానశక్తి కుల సుందరీదేవీగా అలంకరించగా.. ఆలయ పూజారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు జ్ఞాన శక్తి కుల సుందరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ ఈఓ రాముల సునీత తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు పాల్గొన్నారు.
వరంగల్ లీగల్: హైకోర్టు న్యాయమూర్తి, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేనారెడ్డి ఈనెల 25న (శనివారం) హనుమకొండ జిల్లా కోర్టుకు రానున్నారు. హనుమకొండ జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు జిల్లా కోర్టు, రెండు జూనియర్ సివిల్ కోర్టులను ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అయన జిల్లా కోర్టు ప్రాంగణంలోని 10 కోర్టుల భవనంలో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
వరంగల్ చౌరస్తా: రానున్న ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్పై బీజేపీ జెండా ఎగురవేద్దామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ 28వ డివిజన్ రామన్నపేట పార్టీ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రేమేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో పార్టీ కార్యవర్గ ప్రతినిధుల బృందం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: వరంగల్ తూర్పులోని ప్రతీ బూత్లో బీఎల్ఓతో బూత్ ఇన్చార్జ్లు కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ అహ్మద్ నసీర్ అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్ల కాంగ్రెస్ ఎస్ఐఆర్ ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్రాజు, వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు చివరి తేదీ కావడంతో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన ప్రతీ పోలింగ్ బూత్లో జరుగుతున్న తీరును డివిజన్ ఇన్చార్జ్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో 24 డివిజన్ల ఇన్చార్జులు పాల్గొన్నారు.


