జనగామ/చిల్పూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. ఈ మేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జనగామ జిల్లా పరిధిలో జాతీయ రహదారి–163పై రఘునాథపల్లి మండలం నిడిగొండ–కోమళ్ల టోల్గేట్ ప్రాంతం, జనగామ మండలం యశ్వంతపూర్ వై–జంక్షన్తోపాటు ప్రమాదాలకు గురవుతున్న పలు బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాలకు కారణమవుతున్న పరిస్థితులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారి నుంచి గ్రామాలకు వెళ్లే అనుసంధాన రహదారులు, డివైడర్ ఓపెనింగ్ల వద్ద రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, దిశానిర్దేశ సూచికలు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. హైవే వెంట ఉన్న మద్యం దుకాణాల వద్ద వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. పరిశీలన సందర్భంగా స్థానిక ప్రజలతోపాటు కరుణాపురం, వంగాలపల్లి, నష్కల్, చిన్నపెండ్యాల గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని హైవే అధికారులకు సూచించారు. అనంతరం ఎన్హెచ్–163పై రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సేవలు అంది స్తున్న అంబులెన్స్ను పరిశీలించి, అందులోని వైద్య సౌకర్యాలు, సిబ్బంది స్పందన తీరుపై ఆరా తీశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ, ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్, మేనేజర్ లింగయ్య, జనగామ రూరల్, స్టేషన్ఘన్పూర్ సీఐలు శ్రీనివాస్రెడ్డి, వేణు, చేరాలు, ఎస్సైలు సిరిపురం నవీన్కుమార్, శ్రవణ్కుమార్, ఆర్ఎస్సై నవీన్, రోడ్డు రవాణా శాఖ, ఎకై ్సజ్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత
జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన


